రుక్మిణికి ఇచ్చినది
శచీంద్రుని నందనోద్యాన పారిజాతం
నీకేపుడో ఇచ్చేసినది
సత్యేంద్రుని మనోవన పారిజాతం.
నను వరించి వచ్చిన
వనితామణులు ఆ ఏడుగురు.
దివ్యమణితో లభించిన
షోడశకలానిధివి నీవు.
నీ శౌర్యం...
అణచింది నరకుని క్రౌర్యం
రౌద్ర రసంలోనూ తొణికింది
నీ అపురూప సౌందర్యం....
నీతో ప్రణయం
తుషార బిందు మాలికామయం
నీతో కలహం
మృగ మరీచికా సమూహం...
నీ వలపు వీక్షణలు
మదనుడెక్కుబెట్టిన శృంగార అస్త్రాలు..
నీ కోపపు చూపులు
గరళం పూసిన కరకు శరాలు...
మీరను నీ యానతి...
దాటను నీవు గీసిన గీత...
కోపాగ్నికి ఎర్రబడిన నీకు...
వెన్నముద్దలు తిని,
నవనీతభరితమైన
నా అధరపు మధువే లేపనం...
నీ మెత్తని పాదంతో మొదలు పెట్టనీ...
మెల్లగా హద్దులన్నీ దాటనీ...
నీ అలుకలు తీరేదాక...
నా బిగికౌగిలిలో ఒదిగే దాక...